30, అక్టోబర్ 2020, శుక్రవారం

Sarath POURNAMA

 *శరత్ పూర్ణిమ - విశిష్టత:*


ఈ రోజు (30.10.20)శరత్ పూర్ణిమ.


 ఆశ్వీయుజ పూర్ణిమకే శరత్ పూర్ణిమ అని పేరు. ఇది అమ్మవారి ఆరాధనకు చాలా విశేషమైన రోజు. మామూలు ప్రజలు అమ్మవారి ఆరాధన దేవి నవరాత్రులు 9 రోజులు చేస్తే, దేవీ ఉపాసకులు అమ్మవారి ఆరాధన ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు 15 రోజుల పాటు చేస్తారు. 


ఏడాదిలో ఈ పూర్ణిమ నాడు మాత్రమే చంద్రుడు పూర్తి 16 కళలతో ప్రకాశిస్తాడు. అందువలన ఈ రోజు చంద్రుడిని పూజించాలి.


ఈ శరత్ పూర్ణిమ రోజున చందకిరణాలకు విశేషమైన శక్తి ఉంటుంది. అవి శారీరిక, మానసిక రుగ్మతలను దూరం చేస్తాయి. 


అందువలన చంద్రకాంతిలో కూర్చుని లలితా సహస్రనామ పారాయణ చేయడం, ఆవుపాలతో చేసిన పరమాన్నం చంద్రుడికి నివేదన చేసి రాత్రంతా చంద్రకాంతిలో ఉంచి, ఉదయాన్నే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారు. 


చంద్రకాంతి నుంచి ఈ పౌర్ణమి రోజున అమృతం కురుస్తుందని శాస్త్రం చెప్తోంది. చంద్రకాంతిలో ఉంచిన పరమాన్నం చంద్రకిరణాల లో ఉన్న ఓషిధీతత్త్వాన్ని తనలో ఇముడ్చుకుంటుంది. మరునాడు ఉదయం ఆ పరమాన్నాన్ని కుటుంబసభ్యులందరూ నైవేద్యంగా స్వీకరించాలి.


శ్రీ కృష్ణుడు పరిపూర్ణావతారం. ఆయనలో 16 కళలున్నాయి. అందుకే ఈ శరత్ పూర్ణిమను బృందావనంలో రాసపూర్ణిమ అంటారు. శ్రీ కృష్ణుడు ఈ రోజే మహారాసలీల సలిపాడని అంటారు. కృష్ణుడి వేణుగానం విన్న గోపికలు, అన్నీ వదిలేసి ఆయన కోసం అడవిలోకి పరిగెత్తగా, కొన్ని వేలమంది కృష్ణులు వేలమంది గోపికలతో ఈ పున్నమి రాత్రి మొత్తం నాట్యం చేసారట. 


ఈ పూర్ణిమకే కోజాగరి పూర్ణిమ అనే పేరు కూడా ఉంది. కోజాగరీ పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు.


అందరికి శరత్ పూర్ణిమ శుభాకాంక్షలు🌹🙏🌹